Thursday, July 6, 2017

నవవిధ శాంతులు


జనన నక్షత్రం గండనక్షత్రం అయిన పక్షంలో గానీ, స్త్రీలు ప్రధమ రజస్వల అయిన సమయం దుష్ట నక్షత్రము కలిగి ఉండటంగాని జరిగిన యెడల మన శాస్త్రాలను అనుసరించి క్రింద చెప్పబడిన 9 రకాల శాంతులు చేయడం దోషనివారణగా చెప్పబడినది....

1. తైలావలోకనము: అనగా నూనెలో నీడ చూడటం అని అర్ధం. కంచు లేదా మట్టిపాత్ర యందు మంచినూనె పోసి అందులో పగడం మరియు ముత్యం ఉంచాలి. క్రింద ఉప్పు గుట్టగా పోసి, దాని పై ఈ పాత్రను ఉంచి ముందుగా గణపతి పూజ చేసి తదుపరి ఆ తైలాన్ని ఉంచిన పాత్రకు పూజ చేయాలి. ఆ
తైలంలో ఒకరి నీడ ఒకరు చూడవలెను

2. రుద్రాభిషేకం: నక్షత్రము యొక్క దోషమును బట్టి ఈ రుద్రాభిషేకం పురోహితుల సూచన ప్రకారం చేయించుకోవాలి. శక్తిని అనుసరించి 3 / 5 / 7 / 9 / 11 మంది వేదపాండిత్యంగల పురోహితులతో రుద్రన్యాసయుక్తంగా 11 సార్లు శివాభిషేకము, పూజ జరిపించవలెను.

తదుపరి పూజ జరిపించిన బ్రాహ్మణులను దక్షిణాది తాంబూలాలతో సత్కరించి వారి ఆశీర్వచనం పొందవలెను.

3. సూర్య నమస్కారాలు: ఒంటికాలిపై నిలిచి అరుణ మంత్రమును 108 పర్యాయములు జపించవలెను. దీనికి ఒకరు లేదా ముగ్గురు లేదా ఐదుగురు బ్రాహ్మణులచే యథాశక్తి ఈ జపము జరిపించవలెను

.4. మృత్యుంజయ జపము: అపమృత్యు దోషములు తొలగుటకై యథాశక్తి బ్రాహ్మణులచేత లక్ష సార్లు జపము జరిపించవలెను.

5. నక్షత్రజపము: తగినంతమంది బ్రాహ్మణులచే ఒక్కొక్క నక్షత్రానికీ 108 నుంచి 1008 సార్లు శాంతి మంత్రము జపించవలెను.

6. నవగ్రహ జపం: నవగ్రహములకు 9 మంది బ్రాహ్మణులచే ఆయా గ్రహానికి సంబంధిత శాంతి మంత్రాలను పురోహితుల సూచనలమేరకు జపిస్తారు.

7. హోమము: నవగ్రహముల పేరిట తగు హోమము జరిపిస్తారు.

8. సువాసినీపూజ: తమ తమ శక్తిని అనుసరించి తగినంతమంది ముత్తయిదువులకు భోజనం పెట్టి, తాంబూలం, పువ్వులు, పండ్లు సమర్పించి నమస్కరించి ఆశీస్సులు పొందవలెను.

9. ఈ ఎనిమిది శాంతులు జరిపించిన పిమ్మట, బ్రాహ్మణ సమారాధన చేయవలెను. ఈ తొమ్మిది ప్రకరణములతో చేసిన శాంతి సంపూర్ణం అవుతుంది.
ఈ తొమ్మిది శాంతులు జరిపించడం వలన సర్వ విధాల నక్షత్ర మరియు గ్రహదోషములు మరియు అపమృత్యు భయములు తొలగి శుభము పొందగలరు.
ఎటువంటి శాంతులు లేదా గ్రహ జపాలైనా మీ జాతకాలను అనుసరించి జరిపించుకోవాలనుకుంటే, జ్యోతిష్య శాస్త్ర పండితుల సూచనల మేరకు మాత్రమే భక్తి శ్రద్ధలతో జరిపించుకోవలెను.

Post a Comment

Start typing and press Enter to search